నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసారు. ఆగస్టు 11, ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. బాధితుడు డోలేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, అతని అనుచరులు మరో ఐదు మంది పై పోలీసులు కేసు నమోదు చేసారు. మీడియాకి చెందిన వ్యక్తి పై దాడికి నిరసనగా జర్నలిస్టు సంఘాలు ధర్నా చేపట్టాయి. కోటంరెడ్డి ని ఈ చర్యకు గాను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ జర్నలిస్టులు డిమాండ్ చేసారు. కొంతమంది జిల్లా వైసీపీ నేతలు సైతం ఈ విషయం పై వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇంటిలోకి ప్రవేశించి పరుష పదజాలం, అసభ్యకరమైన మాటలతో దూషించడం మొదలు పెట్టారు. తరువాత ఎమ్మెల్యే పీఏ, అతని అనుచరులు దాడి చేసారని, దాడి చేసిన తరువాత ఎవరికైనా చెప్పుకో భయపడేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసారని చెప్పారు. స్థానిక పోలీసులు డోలేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకొని పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే తానుగా వచ్చి ఒక ఎడిటర్ పై దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
[subscribe]
[youtube_video videoid=Ao6lSTQ6LFE]