మంగళగిరిలో కుంకీ ఏనుగుల బృందాన్ని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Dy CM Pawan Kalyan Welcomes Trained Kunki Elephants Jayanth and Abhimanyu at Mangalagiri

ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కర్ణాటక అటవీ శాఖ సహకారంతో ప్రత్యేక శిక్షణ పొందిన ఆరు కుంకీ (Kunki) ఏనుగులను రాష్ట్రానికి తీసుకురాగా, ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో వాటికి ఘనస్వాగతం పలికారు. కుంకీ ఏనుగులతో పాటు వాటిని నిర్వహించే అనుభవజ్ఞులైన మావటీలను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చారు.

అడవి ఏనుగుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం వంటి సరిహద్దు జిల్లాల్లో అడవి ఏనుగుల సంచారం కారణంగా రైతులు, గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల నష్టం, ప్రజల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కుంకీ ఏనుగులను రంగంలోకి దింపాలని అటవీ శాఖ నిర్ణయించింది.

శిక్షణ పొందిన ఈ ఏనుగులు అడవుల నుంచి జనావాసాల్లోకి వచ్చే అడవి ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవుల్లోకి మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల బెడదను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించి, మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజల ప్రాణాలు, రైతుల పంటల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అటవీ శాఖ శాస్త్రీయ పద్ధతుల్లో పనిచేయాలని అధికారులకు సూచించారు. కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగుల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని, ముఖ్యంగా రైతులకు గణనీయమైన ఊరట కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here