హైడ్రా చీఫ్‌ను తొలగించాలన్న హైకోర్టు తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Responds Over HC Orders on HYDRAA Commissioner AV Ranganath

హైడ్రా (HYDRAA) విధులను ఆపేదే లేదని, నగరంలోని ఆక్రమణలను తొలగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. గండిపేట, బతుకమ్మ కుంటలు, ఎన్ కన్వెన్షన్ వంటి ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడింది పేదలా లేక పెద్దలా అని విపక్షాలను ప్రశ్నించారు.

హైడ్రా అనేది తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద పాలనా సంస్కరణ అని, కబ్జాకోరులు మరియు వారి అనుకూల నేతలే హైడ్రా వద్దంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవీ రంగనాథ్ నాయకత్వంలో హైడ్రా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు అత్యంత పారదర్శకంగా జరిగాయని, హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాలు తప్పనిసరి అని తేల్చి చెప్పారు.

హైడ్రా అధికారి ఎంపిక ప్రభుత్వ విచక్షణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు వ్యక్తం చేసిన అసంతృప్తి మరియు తొలగింపు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనేది ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. గతంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పై 400కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన సీఎం, కొందరు దురుద్దేశంతోనే కేసులు వేసి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

కోర్టు తీర్పుపై స్పందన

హైడ్రా బాధ్యతలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై తమకు పూర్తి స్పష్టత ఉందన్న ఆయన.. ముందుగా కోర్టు తీర్పుని కూలంకుషంగా పరిశీలించి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక హైకోర్టులోనే అప్పీల్ (డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడం) చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తెలంగాణకు 11.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం (VB G RAM G) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేర్చి, లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం షెడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here