జూన్ 16, మంగళవారం ఉదయానికి భారత్ లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల/కేంద్రపాలిత సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. జూన్ 16, 17 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల వారీగా సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించబోతున్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ ఆరోసారి భేటీ కాబోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్ గడువు జూన్ 30 తో ముగియనుంది. అలాగే లాక్డౌన్ సడలింపులు తర్వాత కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ప్రతిరోజు కరోనా మరణాలు సైతం పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగించాలా? లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి దేశంలో లాక్డౌన్ విధించాలా అనే అంశంపై ఈ సమావేశంలో సీఎంలతో ప్రధాని మోదీ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమునట్లుగా తెలుస్తుంది.
జూన్ 16న పీఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
- పంజాబ్
- అసోం
- కేరళ
- ఉత్తరాఖండ్
- జార్ఖండ్
- ఛత్తీస్గఢ్
- త్రిపుర
- హిమాచల్ ప్రదేశ్
- చండీగఢ్
- గోవా
- మణిపూర్
- నాగాలాండ్
- లద్ధాఖ్
- పుదుచ్చేరి
- అరుణాచల ప్రదేశ్
- మేఘాలయ
- మిజోరాం
- అండమాన్ నికోబార్ దీవులు
- దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ
- సిక్కిం
- లక్షద్వీప్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu