అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పీఎం మోదీ ప్రసంగించారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి దేశస్థులను, రామ్ భక్తులను ప్రధాని అభినందించారు. రామమందిర నిర్మాణం చారిత్రాత్మకమని పేర్కొంటూ, భారతదేశం ఈ రోజు ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తోందని, దేశవ్యాప్తంగా ప్రజలు శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న దాన్ని సాధించినందుకు ఉత్సాహంగా మరియు ఉద్వేగానికి లోనవుతున్నారని, వీరిలో చాలా మంది వారి జీవితకాలంలో ఈ రోజును నమ్మలేకపోతున్నారని పీఎం మోదీ అన్నారు. గుడి, గుడారాలలో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా మారబోతోందని చెప్పారు. రామమందిరం కల నెరవేరడానికి పోరాటాల చేసిన వారిని ఈ సందర్భంగా పీఎం మోదీ గుర్తుచేసుకుని నమస్కరించారు.
శ్రీరాముడు మన సంస్కృతికి పునాదిగా కొనసాగుతున్నారని పీఎం మోదీ పేర్కొన్నారు. రామమందిరం మన సంస్కృతి, విశ్వాసం, జాతీయ స్ఫూర్తి మరియు సామూహిక సంకల్ప శక్తికి ఆధునిక చిహ్నంగా ఉంటుందని, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని పీఎం అన్నారు. ఈ ఆలయ నిర్మాణం అనేక రంగాలలో అవకాశాలను తెస్తుందని, ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను మారుస్తుందని చెప్పారు. గత సంవత్సరం గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు, తోటి దేశస్థులు స్పందించి అందించిన గౌరవం మరియు సంయమనాన్ని పీఎం ప్రశంసించారు. అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, అదే విధమైన గౌరవం మరియు నిగ్రహం ఈ రోజు కూడా కనిపిస్తుందని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో శ్రీరాముడు గౌరవించబడ్డారని, అన్ని చోట్లా భక్తులు ఉన్నారని పీఎం మోదీ అన్నారు. ఇండోనేషియా, కంబోడియా, లావోస్, మలేషియా, శ్రీలంక, నేపాల్, థాయ్లాండ్లో రామాయణగాథలు ప్రసిద్ధని, ఇరాన్, చైనా దేశాల్లో రాముడు కథలు వినిపిస్తాయని చెప్పారు. రామమందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ దేశాలన్నిటిలో ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ ఆలయం రాబోయే కాలానికి మొత్తం మానవాళికి ప్రేరణగా ఉపయోగపడుతుందని పీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
పరస్పర ప్రేమ, సోదరభావం పునాదిపై ఈ ఆలయాన్ని నిర్మించాలని పీఎం మోదీ ఉద్ఘాటించారు. ‘సబ్కా సాథ్’ ద్వారా మరియు ‘సబ్కా విశ్వాస్’ లతో మనం ‘సబ్కా వికాస్’ సాధించి ఆత్మవిశ్వాసం కూడిన ఆత్మనీర్భర్ భారత్ సాధించాల్సిన అవసరం ఉందని పీఎం చెప్పారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితి నేపథ్యంలో శ్రీరాముడి యొక్క ‘మర్యాద’ మార్గం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుని పీఎం మోదీ ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుత పరిస్థితి మర్యాదని (రెండు అడుగుల దూరం-మాస్క్ తప్పనిసరి) కోరుతోందని, ప్రతి ఒక్కరూ దీనిని అనుసరించాలని పీఎం మోదీ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu