2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు సూచించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచించాలని కోరారు. ప్రస్తుత వానాకాలం సీజన్ లో ప్రభుత్వం సూచించిన మేరకు వందకు వంద శాతం నిర్ణీత పద్ధతిలోనే రైతులు పంటలు సాగు చేశారని, ఇదే ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
ఇటీవల జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణీత పంటల సాగుపై జిల్లాల వారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా యాసంగిలో సాగు చేసే పంటల సాగుపై అంచనాలు రూపొందించారు. దీనిపై గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించి, ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు.
50 లక్షల ఎకరాల్లో వరి, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు:
వరి పంటను 50 లక్షల ఎకరాల్లో, శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షల ఎకరాల్లో, మిరపతో పాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న లక్ష ఎకరాల్లో, నువ్వులు లక్ష ఎకరాల్లో, పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30-40 వేల ఎకరాల్లో, ఆవాలు-కుసుమలు-సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు. వ్యవసాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని సీఎం పిలుపునిచ్చారు. నిర్ణీత పంట సాగు విధానం నిరంతర ప్రక్రియగా జరగాలని చెప్పారు. క్లస్టర్ల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సీజన్ లో విత్తనాలు వేయడం ముగియగానే, వ్యవసాయ శాఖ మరో సీజన్ లో ఏ పంటలు వేయాలనే విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు.
పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానం:
నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేసిన ఫలితంగా పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2020 వానాకాలంలో దేశ వ్యాప్తంగా 3.19 కోట్ల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. కోటి నాలుగు లక్షల ఎకరాల్లో పంటను సాగు చేస్తూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 60.52 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. 56.29 లక్షల సాగుతో గుజరాత్ మూడవ రాష్ట్రంలో, 18 లక్షలతో హర్యానా నాలుగవ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది వరకు తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత మూడో స్థానంలో ఉండేది. 2019 వానాకాలంలో గుజరాత్ లో 65.88 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా, తెలంగాణలో 54.45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయింది.
నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే నూతన విధానానికి అలవడుతుంది:
ఈ విషయంలో రైతుబంధు సమితులు క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ దసరా నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటిత పరిచి, సమన్వయ పరచడం సులభం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. “ఏ కొత్త విధానమయినా, ఎవరికయినా ఒక్క రోజుతో, ఒక్క ప్రయత్నంతో అలవాటుకాదు. నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే నూతన విధానానికి అలవడుతుంది. రైతులకు కూడా, వారికి లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు అర్ధం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయి’ అని సీఎం చెప్పారు. ‘మక్కల సాగు శ్రేయస్కరం కాదు’. మక్కల ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున మక్కల సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా మక్కల సాగు వద్దనే రైతులకు సూచన చేయడం ఉత్తమమని అధికారులు చెప్పారు. మక్కలకు 900 రూపాయలకు మించి ధర వచ్చే అవకాశం లేదని వారు అంచనా వేశారు. మక్కలు వేస్తే మంచి ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. మక్కల సాగు వద్దు అనేదే ప్రభుత్వ సూచన అనీ, అయినప్పటికీ ఎవరైనా రైతులు ముక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్ అని సీఎం స్పష్టం చేశారు. ఎంత ధరవస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu