మెడికల్ డివైసెస్ తయారీలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ‘కన్ఫ్లోయంట్ మెడికల్’ సంస్థ హైదరాబాద్లో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలను కలుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత ‘కన్ఫ్లోయంట్ మెడికల్’ కంపెనీ ప్రతినిధులను కలిసిన కేటీఆర్ తెలంగాణాలో పెట్టుబడులకు ఆహ్వానించగా, కంపెనీని విస్తరించే ప్రణాళికలో భాగంగా తమ తదుపరి యూనిట్ ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని షాన్హో నగరంలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్, సీఈవో డీన్ షావర్ ప్రకటించారు. దీనిపై కన్ఫ్లోయంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం తరఫున కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో తొలిసారిగా అడ్వాన్సుడ్ టెక్నాలజీతో మెడికల్ డివైసెస్ తయారీ యూనిట్ మొదలుపెట్టనున్న ‘కన్ఫ్లోయంట్’.. ఈ యూనిట్ ద్వారా ఇండియాతో పాటు ఆసియాలోని ఇతర సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేయటానికి ప్రణాళికలు వేస్తోంది. భవిష్యత్తులో తమ కంపెనీని అన్ని దేశాలలో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దానిలో భాగంగా ముందుగా హైదరాబాద్లో యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ షావర్ తెలిపారు. త్వరలోనే బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా మంత్రి కేటీఆర్ ఈరోజు మరికొన్ని ప్రముఖ కంపెనీలను కలవనున్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీల సీఈవో లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ