తెలంగాణ రాష్ట్రంలో తోలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారులు శనివారం నాడు వెల్లడించారు. తొలి విడతలో 71.49 శాతం ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998 సీట్లు మిగిలాయని ప్రకటించారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కళాశాలల్లో 3,091 సీట్లు అనగా 98.5 శాతం కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే 164 ప్రైవేట్ కళాశాలల్లో 47,046 బీటెక్ సీట్లు కేటాయించగా, 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయినట్టు పేర్కొన్నారు. మూడు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రం ఒక్క సీటు కూడా భర్తీ కాలేదని చెప్పారు. “బీటెక్లోని 21 కోర్సుల్లో సీట్లన్నీ నిండాయి. బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి. సీట్లు వచ్చి న అభ్యర్థులు ఈ నెల 28లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి” అని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సూచించారు. అక్టోబర్ 29 నుంచి తుది విడుత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంసెట్లో వెయిటేజ్ తొలగించే ఆలోచన:
ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ తొలగించేందుకు యోచిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu