ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోవాల్ సౌదీ అరేబియాలో ఇటీవలే పర్యటించారు. ఆ సమయంలో మోదీ సౌదీ పర్యటనకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లపై చర్చించినట్టు సమాచారం. అయితే మోదీ సౌదీ పర్యటనకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. సౌదీ అగ్ర నాయకత్వంతో పాటు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో కూడ మోదీ చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లోనూ మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడ 2016 లో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీలో పర్యటించారు. అదే విధంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 2019, ఫిబ్రవరిలో భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బాగస్వామ్యాలను పెంపొందించుకోవడంపై కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సౌదీకి చెందిన అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ ఆరామ్కోపై ఇటీవల డ్రోన్ దాడి జరగగా, భారత్ కు చమురు ఎగుమతులపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
[subscribe]