ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా ఆయనకు కరోనా వచ్చిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా అల్లు అరవింద్ స్పందించి, ఆ వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
“అందరికీ నమస్కారం. నాకు కరోనా వచ్చిందని ఈ మధ్య వచ్చిన వార్తలకు స్పందించాలనుకుని ముందుకొచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజం. కాకపోతే ఇందులో మాకు రెండు వ్యాక్సిన్ డోసుల తర్వాత కూడా కరోనా వచ్చిందంట అని చాలాచోట్ల రాస్తున్నారు, చెప్తున్నారు. కానీ నేను అనేదేమిటంటే, నేను ఒక వ్యాక్సిన్ డోసు తీసుకున్నాను. తర్వాత మేం ముగ్గురం స్నేహితులం ఊరెళ్ళాము. ముగ్గురం ఊరెళ్ళి వచ్చిన తర్వాత కరోనా వచ్చిందని తెలుసుకున్నాం. ఇందులో నాకు, ఇంకో ఆయనకు మూడురోజుల పాటు స్వల్ప జ్వరం వచ్చిపోయింది. ఒకాయన ఆసుపత్రిలో చేరారు. తేడా ఏంటంటే ఆ ఆసుపత్రిలో చేరిన అతను వ్యాక్సిన్ వేయించుకోలేదు. మేమిద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. వ్యాక్సిన్ చేయించుకుంటే కరోనా బాధ అంటే కరోనా ప్రభావం అంత తీవ్రంగా ఉండదు. అందుకు మేమే నిదర్శనం. నేను చాలామందిని చూస్తున్నాను, వ్యాక్సిన్ చేయించుకున్న గానీ కొంతమందికి కరోనా వస్తుంది కానీ, చాలా లేట్ గా వస్తుంది. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మా స్నేహితుడిని చూస్తే, మీ అందరికీ ఒక నిజం చెప్పాలనిపించింది. ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వలన మనం కరోనా నుంచి ప్రాణహాని రాకుండా కాపాడబడతాం. ఇది తప్పనిసరిగా గ్రహించి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. దీనికి నేనే ఉదాహరణ. వ్యాక్సిన్ వేయించుకున్న కరోనా వచ్చేస్తుందట గదా అనే అపోహ పెట్టుకోవద్దు. చాలా లేట్ గా వచ్చిపోతుంది. వాక్సిన్ వేయించుకోవడం మాత్రం చాలా ముఖ్యం” అని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ