పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్జిత్ సింగ్ చన్నీ పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చండీఘడ్ లోని రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చరణ్జిత్ సింగ్ చన్నీ చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జ్ హరీష్ రావత్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ముందుగా ఆదివారం నాడు పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నికున్నట్టు కాంగ్రెస్ ఇంచార్జ్ హరీష్ రావత్ ప్రకటించారు. చరణ్జిత్ సింగ్ చన్నీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే పంజాబ్ రాష్ట్రంలో దళిత కమ్యూనిటీ నుండి సీఎం పదవీ చేపట్టిన మొదటి వ్యక్తిగా చరణ్జిత్ సింగ్ చన్నీ నిలిచాడు.
ముందుగా రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య నెలకున్న విభేదాలతో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు సీఎం అమరీందర్ సింగ్ తన పదవీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం రేసులో సీనియర్ నేత అంబికా సోనీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, మాజీ మంత్రి సుఖ్జిందర్ రంధావా పేర్లు నిపించినప్పటికీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్జిత్ సింగ్ చన్నీ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో సోమవారం చరణ్జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా, సుఖ్జిందర్ రంధావా, బ్రహ్మ మొహీంద్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ