దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై ఈ రోజు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితులపై ఎన్కౌంటర్ జరిపిన తెలంగాణ పోలీసులుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. 2014లో సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలను ఈ ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎన్హెచ్ఆర్సీ సభ్యులు బృందం నేరుగా మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించిన అనంతరం చటాన్పల్లి వంతెన దగ్గర ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు సందర్శించబోతున్నారు.
శుక్రవారం నాడు పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు రాసిన లేఖకు స్పందించి నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్పై విచారణ చేపట్టిన అనంతరం ఎన్కౌంటర్లో చనిపోయిన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవుల మృతదేహాలను ఈనెల డిసెంబర్ 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
[subscribe]