తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో మార్చి 14న పోలింగ్ జరగగా, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 3,86,320 మంది ఓటర్లు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 3,57,354 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాల్సి ఉండడంతో ఓట్ల లెక్కింపు పక్రియ ఒకరోజు కంటే ఎక్కువ సమయం పట్టనున్నట్టు అధికారులు భావిస్తున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 1,606 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తునట్టు అధికారులు వెల్లడించారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఫ్రొఫెసర్ కోదండరాం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్.రమణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ