భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కు డిసెంబర్ 6, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నా ఆమెను హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపమని ప్రోటోకాల్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పీవీ సింధుకు డిసెంబర్ 7 2018 నుంచి ఆగస్టు 30 2020 వరకు ఆన్ డ్యూటీ సదుపాయం కూడా మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒలింపిక్స్లో పతకం సాధించినందుకు గానూ పీవీ సింధును గత ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింధు కలుసుకుని టోక్యో ఒలింపిక్స్కు సిద్దమవుతున్న కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించమని కోరారు. అలాగే విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం గుర్తింపు జరుగుతోందని, అవసరమైన చోట ఎంపిక చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆ సందర్భంగా సింధుకు సూచించారు.
[subscribe]