ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162 సచివాలయాలు, పట్టణాల్లో 3,842 మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయని సచివాలయ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,493 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అజయ్ జైన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పశుసంవర్ధక, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా.. గ్రామ, వార్డు సచివాలయాలలోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ