ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసి, ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురాగా, అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం లభించడంతో ఆర్డినెన్స్పై ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నిబంధనల ప్రకారం రమేశ్కుమార్ పదవీకాలం ముగియడంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తొలగింపుపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
ముందుగా కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు గతంలో సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు కూడా చేశారు. ఇలా అనేక పరిణామాల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రమేశ్కుమార్ తొలగింపునకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది.