దేశంలో కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూసే వారికి ట్రాయ్ శుభవార్త చెప్పింది. కేబుల్ ధరలపై మార్పులు తీసుకోస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన న్యూ టారీఫ్ ఆర్డర్ ద్వారా వినియోగదారుడు తమకు నచ్చిన చానెల్ను ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ విధానం ద్వారా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది, అయితే ధరలు ఇంకా పెరగడంతో ఎన్టీవో నిబంధన విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై టారిఫ్ భారం తగ్గిస్తూ, న్యూ టారిఫ్ సేవలకు ట్రాయ్ సవరణలు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జనవరి 1, బుధవారం నాడు ట్రాయ్ జారీ చేసింది. మార్చి 1, 2020 నుంచి కొత్త టారిఫ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త విధానంతో వినియోగదారులు ఇకపై 200 ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ రూ.130 కే పొందవచ్చు. ఇప్పటివరకు 130 రూపాయలకు కేవలం 100 ఛానెల్స్ మాత్రమే అందిస్తున్నారు.200 ఛానల్స్తో పాటు అదనంగా 26 దూరదర్శన్ ఛానల్స్ను కూడా కేబుల్ ఆపరేటర్స్ వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. 200 కంటే ఎక్కువ ఛానల్స్ కావాలని వినియోగదారులు భావిస్తే రూ.160 చెల్లించి అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ పొందవచ్చు. అలాగే అలాకార్టేలో విడివిడిగా ఇచ్చే చానళ్ల ధర బొకే ధరకు ఒకటిన్నర రెట్లకు మించి ఉండకూడదని నిర్ణయించారు. బొకేలో చేర్చిన పే చానళ్లకు సంబంధించి ఒక చానల్కు గరిష్ఠ ధర రూ.19 నుంచి 12కు తగ్గించారు. ఒకటికి మించి టీవీలుంటే 40 శాతానికే రెండో కనెక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. 20 శాతానికిపైగా వీక్షకులుండే చానళ్లకు క్యారియర్ ఫీజు తీసుకోవద్దని, 20 శాతానికి తక్కువగా ఎంత శాతం వీక్షకులు ఉన్నా క్యారియర్ ఫీజును రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడని నిర్ణయించారు. అంతేకాకుండా ఒక భాషకు చెందిన చానళ్లన్నీ ఒకే వరసలో ఉండాలని, చానల్ నంబరును కూడా తరుచూ మార్చకూడదని చెప్పారు. ఒకవేళ మార్చాలంటే అందుకు ‘ట్రాయ్’ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]