తెలుగు ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో జనవరి 2, గురువారం నాడు పార్క్ హయత్ హోటల్లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘మా’లో అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ ఎన్ని గొడవలు ఉన్నా సరే వాటిని మర్చిపోయి అందరూ కలిసి ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా, హీరో రాజశేఖర్ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కుని ప్రసంగించడం మొదలు పెట్టారు. అదే సమయంలో వేదికపై కూర్చున్న చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్బాబు కాళ్లకు రాజశేఖర్ నమస్కారం చేశారు. అనంతరం ‘మా’ గొడవలున్నాయంటూ మాట్లాడడం మొదలుపెట్టడంతో చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్బాబు మరియు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయన్న ఆయన, ఆ ఒత్తిడి వల్లే కారు ప్రమాదం కూడా జరిగిందని చెప్పారు. చిరంజీవి బాగా మాట్లాడారని, అయితే ఇండస్ట్రీలో నిప్పురాజుకుంటుందని, నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుందని చెప్పారు. సమస్యలను ప్రశ్నిస్తూ రియల్ లైఫ్లో కూడా హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారని చెప్పి ఆవేశంగా వేదిక దిగి వెళ్లిపోయారు.
అనంతరం సభలో జరిగిన పరిణామాలతో అసంతృప్తికి గురైన చిరంజీవి మాట్లాడుతూ, “ఇంత ముందు నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మంచి ఉంటే మైకులో చెప్పమని, చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నాను. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. సభను ఎందుకు రసాభాస చేస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం, పద్దతి లేకుండా మైక్ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇలాంటి సమయంలో కూడా నేను స్పందించకపోతే, మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. ఎంత సహనంగా మాట్లాడదామనుకున్నా కాని ఆగ్రహం తెప్పిస్తున్నారు. దయచేసి దీనిని ఇక్కడే వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇష్టం లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు రాకూడదు. క్రమశిక్షణ సంఘం ఉంటే ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోండని” చెప్పారు. అనంతరం వేదికపైకి చేరుకున్న జీవితారాజశేఖర్ మాట్లాడుతూ, రాజశేఖర్ మాట్లాడిన విధానం పట్ల క్షమాపణలు తెలియజేశారు. విబేధాలు పక్కనబెట్టి అందరం కలిసి ‘మా’ ని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.
[subscribe]