గత మూడు రోజులుగా ఏపీలో కలకలం రేపుతున్న కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ప్రమేయం ఉన్నట్లు ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే గడచిన మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కాకినాడ పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ విషయాన్ని కాకినాడ అదనపు ఎస్పీ శ్రీనివాస్ ధృవీకరించారు. ఎమ్మెల్సీని ఈరోజు రిమాండ్ కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన రోజు సుబ్రహ్మణ్యంతో పాటు వీళ్ళిద్దరూ పక్కనే ఉన్నారని అనుమానిస్తున్నారు. దీంతో ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో విచారణ చేస్తున్నారు.
కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలున్నాయని, ఎవరో కొట్టి చంపారని, ఎమ్మెల్సీ అనంతబాబుపై అనుమానాలున్నాయని, దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ.. దళిత సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనలు తెలుపుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ను తక్షణమే బర్తరఫ్ చేసి, ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో వివరించనున్నారు పోలీసులు. ఇక, మరోవైపు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీకి పోలీసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ