ప్రజల ఆస్థిపై హక్కు ప్రజలకే ఉండాలి కానీ, పాలకులకు కాదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పూర్తిగా పారదర్శకంగా, తప్పులులేని విధంగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం చంద్రబాబు అందుకే తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను రూపొందించామని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల్లో, రైతుల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మునుపటి పాలకుల మాట వినని ప్రజాస్వామ్యవాదులు, రైతుల భూములను అక్రమంగా ’22ఏ’ నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన, మైదాన ప్రాంత రైతుల భూములకు భద్రత కల్పిస్తూ ఆ నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఫొటోల పిచ్చికి చెక్.. రాజముద్రతో నూతన పుస్తకాలు
ప్రజల ఆస్తిపై కేవలం ప్రజలకే సర్వహక్కులు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూమి రైతులదైతే, దాని సరిహద్దు రాళ్లపై మరియు పట్టాదారు పాస్పుస్తకాలపై గత ముఖ్యమంత్రి తన సొంత ఫొటోలను, పేర్లను ముద్రించుకోవడం వారి ఫొటోల పిచ్చికి పరాకాష్ఠ అని విమర్శించారు. జగన్ ఫొటోలతో ఉన్న పాత పాస్పుస్తకాలను పూర్తిగా రద్దు చేశామని, వాటి స్థానంలో ఇప్పుడు సగర్వంగా ప్రభుత్వ అధికారిక ‘రాజముద్ర’తో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని ప్రకటించారు.
క్యూఆర్ కోడ్తో పారదర్శక సేవలు
రైతులకు రూపాయి అవినీతి మరియు దళారీ వ్యవస్థల ప్రమేయం లేకుండా పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందువల్లనే ఎలాంటి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా గ్రామసభల వేదికగానే ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నూతన పాస్పుస్తకాలపై ముద్రించిన అధునాతన క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి విస్తీర్ణం, సరిహద్దులు మరియు యాజమాన్య వివరాలను అత్యంత సులభంగా డిజిటల్ రూపంలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.







































