తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం జనవరి 20, సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. అలాగే సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత ప్రచారానికి సెల్ఫోన్, ఇంటర్నెట్ లను కూడా వాడకూడదని ఎస్ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో అభ్యర్థులెవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలును, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుండడంతో జరిగే ఎన్నికల ప్రచారానికి 22వ తేదీ సాయంత్రం వరకు గడువు నిచ్చారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
[subscribe]