తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే.. ప్రగతి భవన్ను ప్రజాభవన్ గా మార్చిన సీఎం.. సామాన్యులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు చెప్పుకోవడానికి వీలుగా ప్రజాదర్బార్ను కూడా ఏర్పాటు చేశారు. అలానే ప్రగతి భవన్ ముందు కొన్నాళ్లుగా ఫెన్సింగ్ను తొలిగించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలపై అధికారులతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా తెలంగాణ భూములకు సంబంధించిన ధరణి పోర్టల్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో తమకు నివేదిక అందించాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారు. ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 13న సచివాలయంలో అధికారులతో కలిసి ధరణి కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ధరణి కార్యక్రమంలో లోటు పాట్లపై వారం లేదా పది రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా ఆ నివేదికలో పొందుపర్చాలని సూచించారు. అంతేకాకుండా ధరణి యాప్ భద్రతపైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలపై వస్తున్న విమర్శలకు.. ఒక డేటా రూపంలో తమకు వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ సదస్సులు, రికార్డుల సవరణను ఇప్పటి వరకూ ఎందుకు చేయలేదని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములపై సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగితెలుసుకున్న సీఎం.. భూ నిపుణుల సలహాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపైనే మెయిన్ ఫోకస్గా సీఎం బుధవారం చర్చించారు. ఇకపై నెలకోసారి అయినా మండల రెవెన్యూ ఆఫీసులలో సదస్సులు నిర్వహించాలని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీపై కూడా సీఎం చర్చించారు.
అలాగే కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అయిన కిషన్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా చర్చించిన రేవంత్ రెడ్డి.. వీటి గురించి పరస్పరం సహకారం ఉండాలని కిషన్ రెడ్డిని కోరారు. త్వరలోనే బీజేపీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపించమని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ