పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడం, అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. పోలాల్లోంచి పెద్దఎత్తున ప్రజలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. అసెంబ్లీ సమీపానికి చేరుకుని ముట్టడికి ప్రయత్నించడంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే సచివాలయం రెండో గేట్ వద్దకు కూడా రైతులు, మహిళలు చేరుకోవడంతో, పోలీసులకు వారికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురుకి గాయాలయ్యాయి. పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలతోనే జాతీయజెండాలు చేతపట్టుకుని అసెంబ్లీ వైపు రైతులు పరుగులు తీస్తున్నారు.
మరోవైపు వెలగపూడిలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అలాగే మందడంలో గ్రామస్తులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి జేఏసీ, ప్రతిపక్ష పార్టీలు ముందుగానే చలో అసెంబ్లీ పిలుపునివ్వడంతో సచివాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. చలో అసెంబ్లీ దృష్ట్యా ప్రకాశం బ్యారేజీని పోలీసులు మూసివేశారు.
రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నాయకులను గృహనిర్బంధాలు, అరెస్ట్లు చేస్తున్నారని, రైతుల ఆందోళన విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాజధాని తరలింపుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులతో కలిసి జాతీయజెండాలు పట్టుకుని ర్యాలీగా వస్తున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి, పోలీసు స్టేషన్ కు తరలించారు.
[subscribe]