సిద్ధిపేట జిల్లాలోని ములుగు రైతు వేదికలో జరిగిన ధరణి అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధరణి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ధరణి అనే విప్లవాత్మకమైన మార్పు తేవడంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగాయన్నారు. గతంలో ఎల్ఆర్ యూపీ ద్వారా కొన్ని భూసమస్యలు మిగిలిపోయాయని, ఆ సమస్యల్ని మీ దగ్గరికి వచ్చి అర్థం చేసుకుని, ఒక్క భూ సమస్య లేకుండా పరిష్కార దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు ములుగులో ధరణిపై అవగాహన సదస్సు చేపట్టామని చెప్పారు.
“ధరణి అనేది ఒక అద్భుతం. ధరణి అనేది ఒక విప్లవాత్మకమైన చర్య. ఆ ధరణిలో నెలకొన్న భూ సమస్యలు ఏంటి అంటే ధరణికి ముందు గత అధికారులు ఎల్ఆర్ యూపీలో కొన్ని భూ సమస్యలు ధరణిలో ఎక్కనందున, ఎదురైన అవాంతరాలు, తప్పుగా ఎక్కడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అలా ఎదురైన భూ సమస్యలకు పరిష్కారం చూపేలా, ఎలాంటి భూ సమస్య లేకుండా చూపాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం” అని మంత్రి పేర్కొన్నారు. ధరణిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరించనున్నాం.
రైతుల భూసమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకు వచ్చారు. ఇది అతి పెద్ద కార్యక్రమం. కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతులు భూములు విషయంలో తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి ద్వారా పరిష్కారమయ్యాయి. కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూసమస్యలు పెండింగ్ లో పడ్డాయి. కోర్టు కేసులు కాకుండా, వ్యక్తి గత సమస్యలు లేకుండా ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టుగా ములుగు మండలంలో వంద శాతం సమస్యలు పరిష్కరించి రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో చేపడతాం. టైం బౌండ్ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని వంద శాతం అన్నీ గ్రామాల్లో నిర్వహించి భూ సమస్యలు పరిష్కారిస్తాం. ఎవరూ అసలు ఆందోళన చెందొద్దు. రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకార్లను ఆశ్రయించవద్దు. డబ్బులు ఇవ్వొద్దు. రైతుల భూములకు వందేళ్ల వరకు కూడా పూర్తి భద్రత ఉంటుంది. ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్ పడింది. భూమిపై పూర్తి హక్కు కల్పించబడింది అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, “ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారు. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యం. ధరణి పోర్టల్ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయి. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చాము, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలట్ గా ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY