ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు నిలిపివేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ కు మద్దతు తెలిపేందుకే మెట్రో సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా పరిమిత సంఖ్యలో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 పైగా ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో వెయిటింగ్ హాల్స్ తో సహా, ఫుడ్ స్టాల్ల్స్ కూడా మూసి వేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ లో మూడు పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఆదివారం నాడు నిర్వహించే జనతా కర్ఫ్యూలో ప్రజలు అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.