కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని వస్తున్న వదంతులు నమ్మెద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్ధరణ కాలేదని ఆయన చెప్పారు. అనవసర వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. కరోనా వైరస్ పై పరిశీలనకై కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం ప్రస్తుతం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో పర్యటిస్తోందని చెప్పారు. ఈ వైరస్ పై వైద్యులకు తగిన సూచనలు చేస్తోందని అన్నారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలును పర్యవేక్షణ చేస్తుందని, కరోనా వైరస్పై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు అసలు లేవని, సమీక్ష అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మరోవైపు చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్, ప్రయాణికులు, పలు ఇతర కారణాలవలన ఇతర దేశాలకూ పాకుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 24X7 హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ వైరస్కు సంబంధించి ఎలాంటి సందేహాలు, అనుమానాలున్నా 011-23978046 నెంబరుకు ఫోన్ చేసి ప్రజలు నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
[subscribe]