మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ ముఖ్యులతో భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 30న చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అధికార టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనిని విజయవంతం చేసేందుకు నియోజకవర్గ నేతలతో పార్టీ ముఖ్యులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇక సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో టీఆర్ఎస్ నేతలు దీనికోసం ఇప్పటినుంచే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సీఎం కేసీఆర్ పర్యటన మరుసటి రోజు అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. క్రితంసారి మునుగోడులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా, ఆ మరుసటి రోజు బీజేపీ నిర్వహించిన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈసారి కూడా 30న టీఆర్ఎస్, 31న బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నాయి. కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిలు పోటీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY