దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్లో మరో ఘనవిజయం సాధించిన యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జనవరి 28, మంగళవారం నాడు సెన్వెస్పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 74 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు నష్టానికి 233 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (62: 6×4, 2×6), అథర్వ అంకోలేకర్ (55*: 54 బంతుల్లో 5×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు. అలాగే సిద్దేశ్ వీర్ (25), చివర్లో రవి బిష్ణోయి(30) పరుగులు చేయడంతో భారత్ 233 పరుగులు చేయగలిగింది. ప్రియమ్ గార్గ్ (5), దివ్యాన్ష్ సక్సేనా (14), తిలక్ వర్మ (2) ఈ మ్యాచ్ లో తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ ముర్ఫీ, కోరీ కెల్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టును భారత్ బౌలర్లు ప్రారంభంలోనే దెబ్బ కొట్టారు. కేవలం నాలుగు పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును ఓపెనర్ సామ్ ఫన్నింగ్(75:7×4, 3×6) పరుగులతో ఒంటరి పోరాటం చేసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. పాట్రిక్ రావె (21), స్కాట్ (35) పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్మన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 43.3 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కార్తిక్ త్యాగి నాలుగు, ఆకాష్ సింగ్ మూడు వికెట్లు తీయగా, రవి బిష్ణోయి ఇక వికెట్ పడగొట్టాడు. 2008 తర్వాత ఆస్ట్రేలియా జట్టు అండర్–19 ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరకపోవడం ఇదే తొలిసారి కాగా, భారత్ జట్టు 2000, 2004, 2006, 2012, 2016, 2018, 2020 సంవత్సరాలలో సెమీఫైనల్ కు చేరుకుంది.