భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మరోసారి ప్రశంసలు కురిపించాడు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ నిర్వహించిన ‘ది సూపర్ కింగ్స్ షో’ లో మాట్లాడుతూ, భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ధోనినే అని చెప్పాడు. భారత్ జట్టును అత్యంత విజయవంతంగా నడిపించడం, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను మూడుసార్లు విజేతగా నిలిపి ఉన్నత స్థానంలో ఉంచినా అది ధోనికే సాధ్యమయిందంటూ కొనియాడాడు. చెన్నై సూపర్కింగ్స్ డ్రస్సింగ్ రూమ్లో ఇప్పటికీ తన అనుభవాన్ని, టాలెంట్ ను దగ్గరగా చూస్తున్నామని పేర్కొన్నాడు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో తాము ఫుల్ జోష్తో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది సరికొత్త టాలెంట్తో ఐపీఎల్ లోకి అడుగుపెడుతుందని రైనా అన్నాడు. తమ జట్టు సీనియర్లు, యువకులతో నిండి సమతూకంగా ఉందన్నాడు. పియూష్ చావ్లా, హేజిల్వుడ్, శామ్ కరణ్, తమిళనాడు నుంచి సాయి కిషోర్ వంటి ప్రతిభావంతులు, విభిన్నమైన ఆటగాళ్లు తమ జట్టులో చేరారని చెప్పాడు. చిదంబరం స్టేడియంలో ప్రస్తుతం అన్ని స్టాండ్లు అందుబాటులోకి రావడంతో రైనా స్పందిస్తూ, అభిమానులు ఇంకా ఎక్కువమంది మైదానానికి వచ్చి చైన్నై జట్టుకు బలంగా నిలుస్తారని అన్నాడు. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ మార్చి 29న మొదలై మే 24న ముగియనుంది.