రేపు (శనివారం) భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమవనుంది. అయితే, ఇది డే/నైట్ టెస్ట్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో పింక్ కలర్ బంతిని ఉపయోగించనున్నారు. మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ రెండో టెస్టుకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్సిఎ) 100 శాతం ప్రేక్షకుల హాజరును అనుమతించింది. చిన్నస్వామి స్టేడియం నిజానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి హోమ్ గ్రౌండ్. ఎందుకంటే అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీములో ప్రారంభం నుండి ఉన్నాడు. అలాగే, టిక్కెట్లకు డిమాండ్ పెరగడంతో కర్ణాటక స్టేట్ అసోసియేషన్ ప్రభుత్వ 100 శాతం అనుమతిని కోరినట్లు తెలిసింది.
రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటికే 1-0తో ముందంజలో ఉంది. మొహాలీలో జరిగిన మొదటి టెస్టును కేవలం మూడు రోజుల్లోనే కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక భారత్ ముందు తేలిపోతోంది. రవీంద్ర జడేజా అజేయంగా 175 పరుగులు చేయటమేకాక బౌలింగ్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ ఆల్ రౌండర్ జాబితాలో మొదటిస్థానానికి చేరుకున్నాడు. అలాగే, రోహిత్ శర్మ కెప్టెన్ గా అదరగొడుతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీ20, వన్డే, టెస్టుల్లో జట్టుకి విజయాలు అందిస్తున్నాడు. అలాగే, కోహ్లీ కూడా పింక్ బాల్ టెస్టుల్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 3 డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన విరాట్ 240 పైగా పరుగులు చేసాడు. ఇది భారత్ కు అనుకూలించే విషయం. ఈ నేపథ్యంలో.. రేపటి నుంచి జరుగనున్న ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ