తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్యస్థలి వద్ద, కనుచూపు మేర జలనిధిగా మారిన ప్రాణహిత గోదావరి గంగ పవిత్ర జలాలను తల మీద చల్లుకొని నాణాలు వదిలి పుష్పాంజలి ఘటించి పూజలు చేసి జల నీరాజనాలు అర్పించుకున్నారు. లక్ష్మీ బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉదృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఇఎన్సీలు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే సహా అక్కడ హాజరైన పలువురు ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవల ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నూతన బాధ్యతలు స్వీకరించిన రజత్ కుమార్ కు సంబంధిత విషయాల పట్ల అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణము, సాగునీటి వినియోగం ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసుకుంటూ రిజర్వాయర్ లను నింపుతూ గోదావరి జలాలు వృధా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్ లదే అన్నారు.
ఎస్సారెస్పీ నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను, రిజర్వాయర్ లను ఎత్తిపోతల పంపులను, కాల్వలను చివరాఖరి ఆయకట్టు దాకా సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయాణం దాకా సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకుని అవసరమైతే పోలీసుల మాదిరి వైర్ లెస్ వాకీ టాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పనిచేయాలని చెప్పారు. సమాచారాన్ని ప్రతిక్షణం చెరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తుంది ఏ పంపు పోస్తుంది ఎన్నినీళ్లు ఎత్తిపోయాలి, ఎప్పుడు ఆపాలి ఎప్పుడు నీటిని కిందికి వదలాలి వంటి పలువిధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలన్నారు. సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగపరుచుకోగలమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్, అక్కడి కలెక్టరేట్లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయడం, నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్తీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్గా విభజించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజినీర్ వ్యవహిస్తారని పేర్కొన్నారు. జూన్ నెల చివరిలోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఏప్రిల్ నెల చివరిలోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్స్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
[subscribe]