భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో దశాబ్దాలుగా జైలులో మగ్గుతున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, జయకుమార్లు విడుదలవనున్నారు. ఈ ఏడాది మేలో విడుదలైన మరో దోషి ఏజీ పేరారివాలన్ కేసును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్లు బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఏడుగురు దోషులకు జీవిత ఖైదు పడింది. 1999లో సుప్రీంకోర్టు నలుగురికి మరణశిక్ష, మిగిలిన ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. రాజీవ్ గాంధీ సతీమణి, నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో 2000లో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చారు. 2014లో సుప్రీం కోర్టు పెరారివాలన్తో సహా మిగిలిన మూడు మరణశిక్షలను తగ్గించింది.
ఇక ప్రస్తుతం పెరోల్పై ఉన్న నళిని మద్రాసు హైకోర్టు తన పిటిషన్ను తిరస్కరించడంతో త్వరగా విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను వినియోగించడం ద్వారా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్ను విడుదల చేయాలని మే 18న సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఆమె పిటిషన్ దాఖలు చేయబడింది. కాగా మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో జరిగిన ఒక ఎన్నికల సమావేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ దళ సభ్యులు చేసిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 14మంది అసువులు బాసారు. ఈ దుర్ఘటన దేశ చరిత్రలోనే అత్యంత సంచలనం కలిగించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE