భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయని వస్తున్న రూమర్స్ పై కోహ్లీ వివరణ ఇచ్చాడు. విభేదాల గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టి పారేసాడు, రోహిత్ మంచి ఆటగాడని, గొప్పగా ఆడిన ప్రతిసారి తనను పొగుడుతూనే ఉంటానని చెప్పాడు. అంతే గాక తనకు ఎవరైనా నచ్చకపోతే అది తన మొహం పై స్పష్టంగా కనిపిస్తుందని, తనకు ఫీలింగ్స్ దాచుకోవడం తెలియదని తెలిపాడు. క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మా ఇద్దరిమధ్య, ఈ అబద్ధాలను ఎవరు సృష్టిస్తున్నారో తెలియడం లేదన్నాడు, డ్రెస్సింగ్ రూమ్ లో అందరి ఆటగాళ్ల మధ్య మంచి సఖ్యత ఉంది, అదే మైదానంలో కూడ ప్రతిబింబిస్తుందని, మంచి క్రికెట్ ఆడుతున్నాం కనుకే టెస్టుల్లో ఏడో స్థానం నుండి అగ్ర స్థానానికి చేరుకున్నాం అని చెప్పాడు.
రవిశాస్త్రితో మంచి అనుబంధం ఉందని, మళ్ళీ అతన్నే కోచ్ గా కొనసాగిస్తే సంతోషిస్తాం అని చెప్పాడు. కోచ్ మార్పుల గురుంచి ఇంకా తననెవరూ సంప్రదించలేదని, నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్ సలహా కమిటీ అని, అడిగినపుడు తప్పకుండ అభిప్రాయం చెబుతాను అని తెలిపాడు. 2020 లో జరగబోయే టీ-20 ప్రపంచకప్ పై జట్టు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, దానితోపాటు త్వరలో టెస్టు ఛాంపియన్ షిప్ మొదలవుతున్న నేపథ్యంలో టెస్టులు పై కూడ దృష్టి సారించాలని చెప్పాడు.