భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)పై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో ఎన్సీఏ అధ్యక్షుడు రాహుల్ ద్రావిడ్ ను కలుసుకుని, ఎన్సీఏ కార్యకలాపాలు మరియు రోడ్మ్యాప్ గురించి చర్చించబోతున్నారు. గత జులైలో ఎన్సీఏ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ద్రావిడ్ ఇప్పటికే సంస్థ కోసం రోడ్మ్యాప్ను రూపొందించారు, గంగూలీ దానిపై చర్చించి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. అక్టోబర్ 30, బుధవారం నాడు బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బీసీసీఐ ఆఫీసు-బేరర్లు అందరూ పాల్గొనబోతున్నారు. వారితోపాటు ఈ సమావేశానికి ఎన్సీఏ సీఈఓ తుఫాన్ ఘోష్ కూడా పాల్గొంటారు.
ఎన్సీఏ లో ఉన్న సమస్యలతో పాటు, భారత క్రికెట్ అభివృద్ధికి భవిష్యత్లో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలో గంగూలీ, ద్రావిడ్ చర్చిస్తారని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. గతంలో కూడ వీరిద్దరూ కొన్ని బీసీసీఐ సాంకేతిక కమిటీ సమావేశాలలో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో గంగూలీ అధ్యక్షత వహించగా, ద్రావిడ్ భారత అండర్ -19 మరియు ఏ జట్టు హెడ్ కోచ్గా హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా రాహుల్ ద్రావిడ్ ఉండడం భారత క్రికెట్ లో నూతన మార్పులు, అభివృద్ధి దిశగా ఏంతో మేలు జరుగుతుందని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్, భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.