తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు రోజుల ‘మహానాడు’ కార్యక్రమం రాజమహేంద్రవరంలో నేటినుంచి (శనివారం, మే 27, 2023)ప్రారంభం అవుతోంది. నగర శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన విశాలమైన మైదానం వేదికగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి సంవత్సరం నేపథ్యంలో ఈ ఏడాది మహానాడు సమావేశాలు జరుగుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తొలి రోజు ప్రతినిధుల సభ, రేపు (ఆదివారం) రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక నేడు ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే వీరితోపాటు ఇంకో 30-40 వేల మంది పార్టీ కార్యకర్తలు కూడా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీంతో నిర్వాహకులు తొలి రోజు 50 వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక శనివారం ఈ వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి మొదట టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభ రిజిస్టర్లో తొలి సంతకం చేస్తారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదిక వంటి ఎజెండా ఉంటుంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో మహానాడు మొదలవుతుంది. తర్వాత వివిధ అంశాలపై మొత్తం 21 తీర్మానాలను మహానాడులో చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్కు, ఆరు తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతినిధుల సభలో 15 వేల మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా సభా ప్రాంగణం సిద్ధంచేశారు. వేదిక మీద సుమారు 300 మంది కూర్చునే అవకాశం ఉంది. ఇక రేపు వేమగిరి వద్ద సుమారు 55 ఎకరాల విశాలమైన స్థలంలో బహిరంగ సభ జరుగనుంది. కాగా గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీ జనసందోహం తరలిరావడం ఆ పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. దానిని మించి విజయవంతం చేయాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE