తెలుగుదేశం పార్టీ ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం రేపు (శనివారం, మే 27, 2023) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. రేపటినుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాజమండ్రి సమీపంలోని వేమగిరి వేదిక కానుంది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున పసుపు తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, గన్నికృష్ణ, ఆదిరెడ్డి వాసు, అనగాని సత్యప్రసాద్ తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహానాడును విజయవంతం చేసేందుకు గోదావరి జిల్లాలోని ప్రతి ఇంటినుంచి జనం తరలిరావాలని నేతలు పిలునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు రాజమహేంద్రవరం రూరల్లోని పిడింగొయ్య జైహింద్ నగర్లో ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మహానాడుకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
కాగా మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో 15 తీర్మానాలపై చర్చ జరుగనుంది. 15 వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీలోని ముఖ్యుల కోసం పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. వేదిక మీద పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పొలిట్బ్యూరో సభ్యులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ ఇన్చార్జిలు ఆశీనులవుతారు. వేదిక మీద సుమారు 300 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో తీర్మానంపై కనీసం ఇద్దరు చొప్పున సుమారు 50 మంది వరకూ మాట్లాడే అవకాశం ఉంది. చివరిరోజు భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో జరుగుతుండటంతో ఈ ఏడాది మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నానికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. నగరంలోని మంజీరా ఇంటర్నేషనల్ హోటల్లో బస చేసిన ఆయన, సాయంత్రం టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాల మీద, కార్యక్రమ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాగా చంద్రబాబు మూడు రోజుల పాటు రాజమండ్రిలోనే ఉండనున్నారు. ఇక మహానాడులో పాల్గొనాల్సిందిగా పార్టీ క్యాడర్కు ఆయన ఆహ్వానం పలికారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆహ్వాన పత్రంలో చంద్రబాబు చేసిన డిజిటల్ సైన్ ఉండటం విశేషం. ఇక మరోవైపు మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నేటినుంచి నాలుగు రోజులు విరామం ప్రకటించారు. ఇప్పటికి 110 రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర తిరిగి మంగళవారం జమ్మలమడుగులో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నారా లోకేశ్ కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈరోజు ఆయన రాజమండ్రి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE