ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మిగిలిన నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. అందులో ఒకటి జనగామ. ఆ టికెట్ కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు టికెట్ విషయంలో ఎవరు కూడా తగ్గేదే లే అంటే తగ్గేదే లే అన్నారు. దీంతో అధిష్టానం ఇద్దరిలో టికెట్ ఎవరికి కట్టబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ముందు నుంచి కూడా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే మొగ్గుచూపింది. ఈక్రమంలో ముత్తిరెడ్డిని శాంతింప జేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి ముత్తిరెడ్డిని సంతృప్తి పరిచేందుకు.. ఆయనకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ముత్తిరెడ్డి.. ఆ తర్వాత కూడా టికెట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎన్నికల బరిలో తానే ఉంటానని.. టికెట్ తనకే వస్తుందని ముత్తిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈక్రమంలో ఇక ముత్తిరెడ్డి తగ్గేలా లేరని స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇవాళ వారితో భేటీ అయ్యారు. జనగామ ప్రతినిధులు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డిలతో కేటీఆర్ మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పల్లా, ముత్తిరెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. అలాగే జనగామ అభ్యర్థిని అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ.. అన్అఫీషియల్గా పల్లాకు జనగామ టికెట్ ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కేటీఆర్ సూచించారు. దీంతో జనగామ జగడానికి పులిస్టాప్ పడినట్లు అయింది.