అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో మరో కీలక మార్పును తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షాకులు, సర్ఫ్రైజ్లు ఇవ్వడంలో ముందు వరుసలో ఉండే మస్క్ ఈ సారి ట్విటర్లో రిప్లయ్లను పరిమితం చేయడానికి.. కొత్తగా ఆప్షన్ను యాడ్ చేసారు.
నిజానికి ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. గత
సంవత్సరం ట్విటర్(ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి ఒక్కొక్కటిగా మార్పులు చేస్తూనే వస్తున్నారు. చివరికి ఎవరూ ఏ మాత్రం ఊహించని, యాక్సెప్ట్ చేయలేని ‘ఎక్స్’ పేరును ట్విటర్కు పెట్టి ఇకపై దాని పేరు అదే అంటూ షాకిచ్చారు. అంతేకాదు పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను కూడా యాడ్ చేసేశారు.
ఈ మధ్యనే ఎక్స్ ప్లాట్ఫామ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మొన్నటి వరకూ ఉచితంగా అందించిన ట్వీట్ డెక్ సర్వీసులను.. పెయిడ్ సర్వీసులుగా మార్చేసి యూజర్లకు మరో షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం కల్పిస్తూ.. ఫస్ట్ వీడియో కాల్ సదుపాయాన్ని సహ ఉద్యోగులతో పాటు కనిపిస్తూ మరీ.. స్వయంగా తానే అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేదో బాగుందని యూజర్లు ఫీలయ్యేంతలో మరో కీలక మార్పుతో ముందుకొచ్చేశారు.
ట్వీట్స్కు రిప్లయ్ ఇచ్చే విషయంలో తాజాగా ఎలాన్ మస్క్ కీలక మార్పును చేశారు. రిప్లయ్లను పరిమితం చేయడానికి కొత్తగా ఒక ఆప్షన్ను యాడ్ చేశారు. కేవలం వెరిఫైడ్ ఎక్స్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్లు వచ్చేలా మస్క్ మార్పులు తీసుకువచ్చారు. అంటే ఈ మార్పుతో ఇకపై వెరిఫైడ్ కాని యూజర్లు ఎవరూ.. రిప్లయ్ ఇవ్వడానికి ఏమాత్రం సాధ్యపడదు.
మస్క్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జనరల్ యూజర్లను కూడా వెరిఫైడ్ అకౌంట్ల వైపు మళ్లించడానికే ఎలాన్ మస్క్ ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారని.. ఇలా ఇంకెన్ని చేస్తారోనని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఆప్షన్ వల్ల సెలబ్రెటీలకు మాత్రం మంచిదేనని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే.. ఇకపై వారికి ట్రోలింగ్స్ బెడద తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ సెలబ్రెటీలు ఎవరైనా పోస్ట్ చేసినా, ట్వీట్ చేసినా సాధారణ యూజర్ కూడా నచ్చిన కామెంట్లు పెట్టేవారు. దీంతో ప్రముఖులు కాస్త ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా మస్క్ తీసుకువచ్చిన ఈ మార్పుతో కేవలం వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే కామెంట్లు చేసే వీలుండటంతో.. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవని నెటిజన్లు అంటున్నారు.