ప్రొఫెసర్ కోదండరామ్.. ప్రతేక తెలంగాణ అనంతరం పరిచయం అక్కర్లేని పేరు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేసిన ముద్దసాని కోదండరామ్.. ఉద్యమ భావాలు గల వ్యక్తిత్వం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సారథి అయితే.. వెనుక ఉండి నడిపించిన రథసారథుల్లో కీలకమైన వ్యక్తి. విద్యార్థులను ఉద్యమంలోకి ఆకర్షించేలా చేసి.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష బలపడడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్తో సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతో ప్రత్యక్షంగా పనిచేశారు. అన్ని సంస్థలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ)కి నాయకత్వం వహించడంలో కీలక సభ్యుడు ప్రొ.కోదండరామ్.
అంతకు ముందు నుంచే ప్రజా సమ్యలపై స్పందించే వ్యక్తి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదికల్లో క్రియాశీలకంగా పని చేసేవారు. ప్రధానంగా ఆదివాసీల సమస్యలు, పటాన్చెరు, జీడిమెట్ల చిన్న పరిశ్రమల కార్మికుల వెతలు, మెదక్, మహబూబ్నగర్ కరువు ప్రాంతాల్లో ఆకలి చావులు, సిరిసిల్ల, ప్రకాశం జిల్లా చీరాలలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వరంగల్ పత్తి రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. అయితే.. రాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆయనకు.. స్వరాష్ట్రంలో గుర్తింపు కరువైంది. రానురాను కేసీఆర్కు, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో తన ఆశయాలకు అనుగుణంగా మార్చి 2018 లో రాజకీయ పార్టీ తెలంగాణ జన సమితిని ప్రారంభించారు. వివిధ సమస్యలపై బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడారు. నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, అంగన్వాడీలు, మహిళలు, టీచర్లు తదితర వర్గాల గొంతుకై నిలిచారు.
ఆర్థిక బలం అంతగా లేకపోవడంతో ఎన్నికల్లో టీజేఎస్ రాణించలేకపోయింది. కానీ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుల్లో ప్రముఖ వ్యక్తిగా ఆయనకు తెలంగాణలో గుర్తింపు ఉంఇ. ఉద్యమ క్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ఇష్టం లేకపోయినా మిలియన్ మార్చ్, సాగరహారం మహత్తర ఘట్టాలకు కోదండరామ్ పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణ, వంటావార్పు, సకల జనుల సమ్మె వంటి ఉద్యమ కార్యక్రమాలు ఆయన సారథ్యంలోనే జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా టీ జేఏసీని కొనసాగించారు. ఆ గుర్తింపుతోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను అక్కున చేర్చుకుంది. ఎన్నికల ముందు టీజేఎస్ తో కలిసి పని చేసింది. పొత్తులో భాగంగా కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఆయనను అప్పట్లోనే చట్టసభల్లోకి తీసుకుంటారన్న చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి టెర్మ్లో కోదండరామ్కు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇస్తారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ… బీఆర్ఎస్ పార్టీకి, కోదండరామ్కు మధ్య పొరపొచ్చాలు పెరిగాయి.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత.. తెలంగాణ ఉద్యమ సారథిగా పేరున్న కోదండ్ రామ్ కు మరోసారి ప్రజల గొంతుకగా నిలిచే అవకాశం దక్కింది. అన్ని అంశాలపైనా అవగాహన ఉన్న మేధావిగా, స్వతహాగా సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తిగా.. పెద్దల సభలో ఆయన ఎలా మెప్పిస్తారన్నదిగా ఆసక్తిగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (కేంద్ర చట్టం 43 ఆఫ్ 1951)లోని సెక్షన్ 156, 157 ప్రకారం, గవర్నర్ నామినేట్ చేసే సభ్యుని పదవీకాలం సెక్షన్ 74 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఎగువ సభగా పనిచేస్తున్న తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 40 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం, భారత్ రాష్ట్ర సమితికి 27 మంది సభ్యులతో హౌస్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అమీర్ అలీ ఖాన్, ఎం కోదండరామ్ల నియామకంతో కాంగ్రెస్ కు ఇప్పుడు కౌన్సిల్లో నలుగురు ఎమ్మెల్సీలను కలిగి ఉంది. ఎంఐఎం కు ఇద్దరు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ