లోక్ సభ ఎన్నికలకు త్వరలోనే తేదీలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో విపక్ష పార్టీలు ఈసారి పదునైన వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపిక, కేడర్ పటిష్టత కోసం తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విస్తృత స్థాయిలో పర్యటనలు సాగిస్తున్నారు. లోక్ సభలో మెజారిటీ సీట్లు సాధించలేకపోతే.. పార్టీ బలహీన పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా కీలకమైన వ్యక్తులను రంగంలోకి దింపి కనీసం పది సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అధికార పార్టీ కాంగ్రెస్ లోక్ సభపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే.. టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఉండడంతో సంక్షేమ పథకాల అమలు బాధ్యత ఆయనపై ఉంది.
ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే.. వేలాది కోట్ల రూపాయలు అవసరం ఉంది. అయితే.. ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేసేది లేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వనరుల సమీకరణకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అందుకే.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి పెట్టుబడుల సమీకరణపై రేవంత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆ దిశలో ఆశాజనక ఫలితాలు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతం కావడం. మూడు రోజుల పర్యటనలో 200 సంస్థలతో సంప్రదింపులు జరపగా.. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది.
గతేడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు అని కాంగ్రెస్ సర్కారు చెబుతోంది. పెద్ద పెద్ద సంస్థలన్నీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించడంలో రేవంత్ సఫలీకృతం అయ్యారు. అక్కడి పరిస్థితులు, వ్యక్తులకు అనుగుణంగా వేషభాషల్లో పరిణతి చూపుతూ రేవంత్ అందరి దృష్టినీ ఆకర్షించారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. అయితే.. కార్యరూపం దాల్చితేనే అనుకున్న లక్ష్యానికి పూర్తిస్థాయిలో చేరుకున్నట్లు.
మరోవైపు.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఎఫ్ఐటీయుఆర్-2024 పేరుతో జరిగిన అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 3,500 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికలు చేపట్టామన్నారు. అలాగే కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన 300 కోట్ల రూపాయలతో వివిధ పర్యాటక మౌలిక సదుపాయ ప్రాజెక్టుల పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ గుర్తింపు సాధించిందని అన్నారు. అలాగే.. మొదట తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ప్రముఖ ట్రావెల్ అండ్ టూరిజం వాటాదారులతో మంత్రి జూపల్లి చర్చించారు. ‘‘తెలంగాణ – ద హార్ట్ ఆఫ్ ద డెక్కన్’’గా విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన ప్రణాళికలను వివరించారు. దీంతో పర్యాటక పరంగాకూడా పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అలాగే.. అనవసర వ్యయాన్ని తగ్గించి.. అవసరమైన వాటికి పెంచేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులు రాష్ట్ర అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ