తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితుల హోం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొంత మందికి 28 రోజులవరకు వైరస్ లక్షణాలు కనిపించడం లేదని, అందువలన వారికీ 14 రోజులకే క్వారంటైన్ గడువు ముగిస్తే మరిన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇకపై అనుమానితులు 14 రోజులు కాకుండా 28 రోజులు హోం క్వారంటైన్లో కచ్చితంగా ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కరోనా వైద్య పరీక్షల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకనుంచి కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని, సెకండరీ కాంటాక్టులను పరీక్షలు చేయొద్దని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 21, మంగళవారం నాటికి 928కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం 928 పాజిటివ్ కేసులకు గాను 23 మంది మృతి చెందగా, 194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించారు. ప్రస్తుతం 711 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu