రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 1, శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నందున, వారిపట్ల అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలనీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. త్వరలో విదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశముండడంతో క్వారంటైన్ కేంద్రాల్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని కోరారు.
ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రజలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించి వైరస్ సోకలేదని నిర్ధారించాకే పంపుతారని, వారు రాష్ట్రానికి చేరుకున్న తరువాత క్వారంటైన్లో ఉంచాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే వారికోసం పెద్ద ఎత్తున క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, సదుపాయాలు, భోజనం పారిశుద్ధ్యం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబుకు సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గించేందుకు కూడా వ్యూహం ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu