పరవాడ ఫార్మా సిటీలోని లారెస్ ఫార్మా సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్ధిక పరిహారం ఇవ్వడంతో పాటుగా అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉన్న మరో కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. విశాఖ ప్రాంతంలోని ఫార్మా పరిశ్రమల్లోనూ, ఇతర పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారులు, సంబంధిత కమిటీల సభ్యులు ఏ మేరకు పని చేస్తున్నారనే ప్రశ్న ప్రమాదాలు సంభవించిన ప్రతిసారి ఉత్పన్నమవుతుంది. విశాఖ ప్రాంతంలోని ప్రతి పరిశ్రమలోనూ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయాల్సిందిగా మంత్రి అమరనాథ్ మరియు జిల్లా కలెక్టర్ కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE