ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మే 2, శనివారం నాడు మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ మండీల్లో లైసెన్స్ మొండెదార్లు (గొర్రెల విక్రయదారులు)తో సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మాంసం ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని, ఇది సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 700 రూపాయలకు మించి విక్రయిస్తే శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాంసం దుకాణాదారులు మటన్ ధరలను అడ్డగోలుగా పెంచి విక్రయిస్తున్నారని ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల తోనే పశుసంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో మొండె దారులు అందరూ లాక్డౌన్ కారణంగా తాము ఎక్కువ లాభాలు ఆశించకుండా, ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తీ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ రోజు నుంచి గొర్రెలను కేవలం మాంసం దుఖాణాల నిర్వాహకులకే విక్రయిస్తామని, మధ్య దళారులకు గొర్రెలను విక్రయించబోమని మంత్రికి విన్నవించారు. తమకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపద్యంలో ప్రత్యేక పాసులను ఇప్పించాలని, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే గొర్రెల వాహనాలకు ఆటంకం కలగకుండా అనుమతులు ఇప్పించాలని మొండెదారులు మంత్రిని కోరారు. సమస్యలను తమ దృష్టి కి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో తనిఖీ బృందం డిప్యూటీ డైరెక్టర్ వెంకటసుబ్బారావు, డాక్టర్ బాబుబేరి, సింహారావు, సుభాష్, నిజాం, మొండెదారులు గౌలిపుర ప్రకాష్, హోమర్, పి.లక్ష్మణ్, రాజు మల్తూకర్, కమల్ ప్రకాష్, భగీరద్, శ్రీనివాస్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu