కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల డబ్బును వృధా చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ విషయంలో సీఎం కెసిఆర్ ఏక పక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సరైన సాంకేతిక పరిజ్ఞానం, ముందు చూపు లేకుండా నిర్మించారని చెప్పారు. అన్నారం బ్యారేజ్ లోకి నీటిని ఎత్తిపోసిన ప్రభుత్వం తిరిగి అదే నీరును వృధాగా నదిలోకి వదిలేయడం చూస్తుంటే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాదు, ఎత్తి దింపుడు ప్రాజెక్టులా మారిందని ఎద్దేవా చేసారు.
దాదాపుగా రూ. 80,500 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ తో నష్టం జరిగిందని, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని అడిగారు. సాంకేతిక పరమైన కారణాల వలన అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు తిరిగి మళ్ళీ కాళేశ్వరంలోకే వస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేసారు. సాంకేతిక నిపుణులు, ప్రముఖ ఇంజనీర్లతో ఒకసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనను పునః పరిశీలించాలని మీడియా సమావేశంలో బండారు దత్తాత్రేయ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు.
[subscribe]
[youtube_video videoid=M3lXbbXmoV8]