దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు రికార్డు సృష్టించారు. అసోసియేట్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం అత్యధిక సంపాదన కలిగిన సీఎంలలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నట్లు తేలింది. ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ సుమారు 931 కోట్ల రూపాయలుగా తేలింది. ఏపీ సీఎం చరాస్తుల విలువ 810 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ 121 కోట్లుగా ఉన్నట్లు తేలింది.
332 కోట్ల రూపాయల ఆస్తుల విలువతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండవ స్థానంలో ఉండగా.. 51 కోట్లతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కేరళ సీఎం విజయన్ కోటి, జమ్ము కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా 55 లక్షల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అత్యంత బీద సీఎంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని తేలింది. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షలు మాత్రమేనని.. అసోసియేట్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత.. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ ఫలితాలు వెలువడిన తర్వాత.. అసోసియేట్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ.. అనేక వడపోతల తర్వాత దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరో ప్రకటించింది. కాగా గతంలో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. అప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. ఆయన కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభించింది. మరోసారి ఇన్నాళ్లకు చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత బిహార్ సీఎం నితీష్ కుమార్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు.