కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన టైమ్లో ఇచ్చిన హామీని ఇప్పుడు నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో..ఏపీ వాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్ కోస్ట్ రైల్వేజోన్కు ఫిబ్రవరి 7న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తాము ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జోన్ ఏర్పాటు చేసింది. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్రం శుక్రవారం వెల్లడించింది. పాత వాల్తేర్ డివిజన్ను కేంద్రం రెండుగా విభజించింది. 410 కిలోమీటర్ల మేర విశాఖపట్నం డివిజన్గా మార్పు చేసింది. మిగతా 680 కిలోమీటర్ల రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ను ఏర్పాటు చేసింది. రాయగడను ఈస్ట్కోస్ట్ రైల్వేలో చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కాగా.. ఏపీ విభజన చట్టం ప్రకారమే ఇప్పుడు తాము సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నామని.. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.