తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని, అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అక్టోబరు 10న ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, ఐదు రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఇక పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందన్నారు. అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందని, త్వరలో భూమిపూజ చేస్తామని చెప్పారు. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY