తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ కు సంబంధించి భవిష్యత్ కార్యచరణ, సడలింపులపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఇప్పటికే గణనీయమైన సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం, రెడ్ జోన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి లలో లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తుంది.
గత వారం రోజులుగా తెలంగాణలోని జిల్లాల పరిధిలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే జీహెఛ్ఎంసీ పరిధిలో మాత్రం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వివిధ జిల్లాల వలస కార్మికుల్లో కూడా కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో లాక్డౌన్ నిబంధనలు, సడలింపులు, నియంత్రణ చర్యలు, వలస కార్మికుల కోసం పాటించాల్సిన విధానాలు తదితర అంశాలపై ఈ రోజు జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సేవలు ప్రారంభించడం, రైళ్ళ ప్రయాణాలపై పరిశీలన, పదో తరగతి పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరం, రెడ్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు, దుకాణాలు తెరిచేందుకు అనుమతులు, ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపుల వలన ఏర్పడ్డ పరిస్థితులు వంటి అంశాలపై కీలకంగా చర్చించి నిర్ణయాలను వెల్లడించనున్నారు. సమావేశం అనంతరం సంబంధిత వివరాలను సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో తెలియజేసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu