ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 150 రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న కూడా రైతులు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు 150 రోజులవుతున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు… ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర. రాష్ట్రం కోసం 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలది. ప్రభుత్వానికే 5వేల ఎకరాల ఆస్తి కట్టబెట్టి ‘బిల్డ్ ఏపి’ చేశారు. వారి త్యాగాలతో రాష్ట్ర ప్రజలకు రూ. లక్ష కోట్ల ఆస్తి సమకూరితే, మూర్ఖత్వంతో ఆ ఆస్తిని వైసీపీ పాలకులు మట్టిలో కలిపేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ‘బిల్డ్ ఏపి’ని ‘సోల్డ్ ఏపి’గా మార్చి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. నిర్మాణం విలువ తెలియని విధ్వంసకుల చేతుల్లోకి రాష్ట్రం చేరడమే ఈ దుస్థితికి కారణం. రాజధాని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆవేదనతో 64మంది రైతులు గుండెపోటుతో మరణించారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా రాజధాని ప్రజలను కలిసి పలకరించిన పాపానికి పోలేదంటే… ఎంతటి కర్కోటక పాలనలో ఉన్నామో అర్థమవుతోంది. లాక్డౌన్ కాలంలోనూ శాంతియుతంగా, ఆత్మ విశ్వాసంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలూ… మీ పోరాటం స్పూర్తిదాయకం. మీకు న్యాయం జరిగే వరకూ మీ అండగా నేనుంటాను. తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధైర్యపడకండని” చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu